ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు చర్యల పిలుపులో భాగంగా నెల్లూరులో భారీ ఎత్తున జరగాల్సిన తెలుగుదేశం పార్టీ (TDP) వార్షిక పండుగ ‘మహానాడు’ వేదిక మారడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నెల్లూరులో నిర్వహించాలనుకున్న ఈ వేడుకలను రద్దు చేసి, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తక్కువ మంది సభ్యులతో, హైబ్రిడ్ పద్ధతిలో ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే, ఈ వేదిక మార్పు వల్ల నెల్లూరు జిల్లాలో రాజకీయ వ్యూహాలు అమలు చేయాలనుకున్న సీఎం చంద్రబాబు ప్లాన్కు గట్టి దెబ్బ తగిలిందనే వాదనలు వినిపిస్తున్నాయి. నెల్లూరులో మహానాడు నిర్వహించడం ద్వారా అక్కడ పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టవచ్చని భావించినా, తాజా నిర్ణయంతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
ప్రస్తుతం నెల్లూరు టీడీపీలో ఎవరి వర్గం వారిదే అన్నట్లుగా సాగుతోంది. అక్కడ మంత్రి పి. నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యామిలీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి అత్యంత శక్తివంతమైన, బలమైన అగ్రనేతలు ఉండటంతో జిల్లాపై పట్టు కోసం ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా వారి అనుచరులు సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్న హల్చల్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా, 2024 ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. భవిష్యత్తులో మళ్లీ పాత రోజులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో, నేతల మధ్య సామరస్యం తేవడానికి మొదట ఈ మహానాడును శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు షిఫ్ట్ చేశారు. మహానాడు ఏర్పాట్లలో నేతలంతా కలిసి పనిచేస్తే విభేదాలు తొలగిపోతాయని అధిష్టానం ఆశించినా, ఇప్పుడు మంగళగిరికి మార్చడంతో ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.
నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గతంలో కడపలో జరిగిన మహానాడులో 5 లక్షల మందితో రికార్డు సృష్టించగా, ఈసారి నెల్లూరులో ఆ రికార్డును బద్దలు కొట్టాలని లోకేష్ టీమ్ భావించింది. కీలక నేతలు, భారీ కేడర్ ఉన్న నెల్లూరులో సభను సక్సెస్ చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపవచ్చని ప్లాన్ చేశారు. కానీ అకస్మాత్తుగా వేదిక మారడంతో ఆ భారీ బహిరంగ సభకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్న సీనియర్ నేతల అంతర్గత వర్గ పోరును మరియు ఇగో ప్రాబ్లమ్స్ను అధిష్టానం ఇకపై ఏ విధంగా డీల్ చేసి సర్దుబాటు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.









