కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి అక్రమ బాగోతాన్ని అతని భార్యే స్వయంగా సమాజానికి బహిర్గతం చేసింది. ఉద్యోగం పేరుతో ఓ నిస్సహాయ యువతిని లోబరుచుకునేందుకు ప్రయత్నించిన భర్తకు సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ, పోలీసులతో కలిసి రౌండప్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. సమాజంలో గురువుగా గౌరవం పొందాల్సిన వ్యక్తి చేసిన ఈ నీచమైన పనికి స్థానికులు తీవ్ర అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడు జాషువా ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో కామర్స్ లెక్చరర్గా పని చేస్తున్నాడు. గతంలో ఒక మహిళా కాలేజీలోనూ పనిచేశాడు. ఈ క్రమంలోనే ఉద్యోగ వేటలో ఉంటూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక యువతి అతనికి పరిచయమైంది. ఆమె నిస్సహాయతను అదునుగా చేసుకున్న జాషువా, తనకు తెలిసిన రికమండేషన్లతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అందుకోసం ఆమెను మచిలీపట్నంలోని గొడుగుపేటలో ఉన్న ఒక గదికి పిలిపించి, ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఒప్పించాడు. యువతితో కలిసి లెక్చరర్ జాషువా గదిలో ఉన్న సమయంలోనే అతని భార్య పక్కా ప్లాన్తో ఎంట్రీ ఇచ్చింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి భర్తను పట్టుకుని, పోలీసులకు సమాచారం అందించింది. చుట్టుపక్కల వారు గుమిగూడటంతో జరిగిందంతా వివరించి, లెక్చరర్ అని కూడా చూడకుండా అతనికి దేహశుద్ధి చేసింది.
ఈ సందర్భంగా భార్య తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. “మాకు పెళ్లై 25 ఏళ్లు దాటింది. పెళ్లైన మొదటి రోజు నుంచే ఇతనికి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే అలవాటు ఉంది. నిలదీస్తే నన్ను దారుణంగా కొట్టేవాడు. ఈ మధ్యే ఒక మహిళ మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలంటూ గొడవ చేసింది. అప్పుడు మా పిల్లలు ఇతనికి బుద్ది చెప్పారు. అయినా బుద్ది మార్చుకోకుండా ఇక్కడికి వచ్చి మళ్లీ అదే వేషాలు వేస్తున్నాడు” అని వాపోయింది. లెక్చరర్ ఉద్యోగం అని నమ్మి ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమానులు సైతం ఈ ఘటనతో షాక్కు గురై, అతని సామాన్లను రోడ్డుపై పడేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జాషువాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.









