ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, ఆయన బంధువు చేగొండి సూర్యప్రకాష్ (చేగొండి జోగయ్య కుమారుడు) మధ్య ఆస్తి వివాదం ముదిరింది. తన తల్లిదండ్రులను సూర్యప్రకాష్ బెదిరిస్తున్నాడంటూ అనంత శ్రీరామ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, ఆ ఆరోపణలను సూర్యప్రకాష్ తీవ్రంగా ఖండించారు. అనంత శ్రీరామ్ తనపై కావాలనే నిరాధారమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని, ఈ విషయంలో ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు సూర్యప్రకాష్ ప్రకటించారు.
ఈ వివాదమంతా ఆస్తికి సంబంధించిందేనని సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. తన తాతయ్య చేగొండి కృష్ణమోహన్ రావుకు చెందిన ఆస్తిని అనంత శ్రీరామ్ అక్రమ మార్గాల్లో స్వాధీనం చేసుకున్నాడని, ఆయనొక “పెద్ద భూ కబ్జా రాయుడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆస్తిని కాజేసేందుకే, తనకు అడ్డు తొలగించుకోవడానికి అనంత శ్రీరామ్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడని ఆయన మండిపడ్డారు.
తాను వృద్ధులైన అనంత శ్రీరామ్ తల్లిదండ్రులను బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సూర్యప్రకాష్ తేల్చి చెప్పారు. తానే గనుక బెదిరించినట్లు ఒక్క ఆధారమైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఒకవైపు ప్రాణభయం ఉందంటూ అనంత శ్రీరామ్ ఫిర్యాదు చేయగా, మరోవైపు సూర్యప్రకాష్ భూకబ్జా ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్తామనడంతో ఈ వివాదం ఇప్పుడు రాజకీయ, న్యాయపరమైన మలుపులు తిరుగుతోంది.









