తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి కేవలం హిట్లర్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ అని, ఆయన ఒక తాలిబన్ లా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాలిబన్లు ఆడపిల్లలను చదువుకు దూరం చేసినట్లుగానే, రేవంత్ రెడ్డి సైతం పేద పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు చదువును దూరం చేయడానికే ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4 వేలకు కుదిస్తామంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో విద్యాశాఖను ముఖ్యమంత్రి ఒక సర్కస్ లాగా మార్చేశారని కవిత విమర్శించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ వ్యవస్థ ఉండదంటూ సీఎం ప్రకటించిన మరుసటి రోజే ఇంటర్ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వడం వారి సమన్వయ లోపానికి నిదర్శనమన్నారు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా అఫిలియేషన్లు ఇవ్వలేదని, డిగ్రీ అడ్మిషన్లను సైతం గందరగోళంగా మార్చేశారని ఆరోపించారు. అలాగే, గురుకుల పాఠశాలల్లో 100 మందికి పైగా విద్యార్థులు మరణించినా సీఎం సమీక్ష నిర్వహించకపోవడం దారుణమన్నారు. రూ.11 వేల కోట్ల ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా తప్పించుకోవడానికే జీవో నంబర్ 7ను తీసుకువచ్చారని, దీనివల్ల ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను దోచుకునే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి వివరణ
మరోవైపు బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన హైడ్రా (HYDRAA) ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనికులు జలవనరులను, చెరువులను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే హైడ్రాను ఏర్పాటు చేశానని, హిట్లర్కు ఇష్టమైన పదం, వ్యవస్థ నుండి స్ఫూర్తి పొంది ఈ పేరు పెట్టానని తెలిపారు. ఈ విభాగంలో 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించామని చెప్పారు. అలాగే యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి ‘ఈగిల్ ఫోర్స్’ను రంగంలోకి దించామన్నారు.
మహిళా సాధికారత, విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను సీఎం వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై జీరో టాక్స్ విధానం వల్ల రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ పర్యావరణం కోసం వెనకడుగు వేయలేదన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, సోలార్ ప్యానెల్ యూనిట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలను రీప్లేస్ చేస్తున్న తరుణంలో, తాము ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీకి కార్పొరేట్ సీఈఓలనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా నియమించామని, వారే సిలబస్ నిర్ణయించి ఉద్యోగాలు కల్పిస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.









