తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ సామాజిక బాధ్యతతో కీలక అడుగు వేశారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గిరిజన ప్రాంతాలలో ‘పెసా’ (PESA – షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం, 1996) చట్టం క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతుందో తెలుసుకునేందుకు ఆయన సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తులు సమర్పించారు. తాను దాఖలు చేసిన ఆర్టీఐ కాపీలను, అధికారులను సంధించిన ప్రశ్నల వివరాలను ఆయన తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాహుల్ రామకృష్ణ ముఖ్యంగా గిరిజన గ్రామాల స్వయంపాలన, గ్రామసభల బలోపేతానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు గిరిజన హక్కుల రక్షణకు తీసుకున్న నిర్ణయాలు, అలాగే 2019 నుండి 2026 మధ్య కాలంలో జిల్లాల వారీగా జరిగిన గ్రామసభల సంఖ్య, వాటి సమీక్షా నివేదికల కాపీలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పెసా చట్టం అమలులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, గవర్నర్ కార్యాలయాల నుండి రాష్ట్రాలకు అందిన లేఖల వివరాలను, గిరిజనులకు అవగాహన కల్పించే సదస్సుల కోసం ఖర్చు చేసిన నిధుల లెక్కలను కూడా సమర్పించాలని కోరారు.
గిరిజన ప్రాంతాలలో నిబంధనల ప్రకారం మైనింగ్ లీజులు, పరిశ్రమల ఏర్పాటు లేదా ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేయాలంటే స్థానిక గ్రామసభల ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల్లో జరిగిన భూసేకరణ ప్రతిపాదనలు, వాటికి గ్రామసభలు ఆమోదం తెలుపుతూ చేసిన తీర్మానాల రికార్డులను కూడా ఆయన తన దరఖాస్తులో ఆరా తీశారు. భూసేకరణ కారణంగా నిర్వాసితులైన ఆదివాసీల పునరావాసం (R&R) విషయంలో చట్టపరమైన నిబంధనలు ఎంతవరకు పాటించారో స్పష్టం చేయాలని, గిరిజన భూవివాదాలు, కోర్టు కేసులు మరియు పెసా అమలుపై రూపొందించిన తాజా సమగ్ర నివేదికల డిజిటల్ కాపీలను తనకు అందించాలని ఆయన ఇరు రాష్ట్రాల గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖలను కోరారు.









