మియాపూర్‌లో దారుణం.. ఆరు నెలల బిడ్డతో సహా భవనంపై నుంచి దూకిన మహిళా టెక్కీ!

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హృదయవిదారకమైన ఘటన వెలుగుచూసింది. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న 37 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, తన ఆరు నెలల పసిబిడ్డను ఎత్తుకుని భవనం ఆరో అంతస్తు నుండి కిందకు దూకేసింది. ఈ ఘోర ప్రమాదంలో సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆరు నెలల పసికందు అద్భుతంగా ప్రాణాలతో బయటపడింది. మరణించిన మహిళను మధ్యప్రదేశ్‌కు చెందిన ఇషా సాహుగా పోలీసులు గుర్తించారు. ఆమె, ఆమె భర్త ఇద్దరూ ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

ఆరో అంతస్తు నుంచి కింద పడుతున్న సమయంలో, నేలను తాకడానికి ముందే ఆ శిశువు అపార్ట్‌మెంట్ రక్షణ కంచె (ఫెన్సింగ్) పై పడింది. అదృష్టవశాత్తు జరిగిన ఈ పరిణామం వల్ల ఆ చిన్నారి ప్రాణాంతకమైన ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడింది. కింద పడిన శబ్దానికి స్థానికులు వెంటనే స్పందించి, ఆ పసికందును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా ఇషా తీవ్రమైన నిద్రలేమి, విపరీతమైన ఆందోళన, ప్రసవానంతర కుంగుబాటు (post-partum depression) లక్షణాలతో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. డెలివరీ తర్వాత మహిళల్లో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మానసిక ఒత్తిడే ఈ ఘోర నిర్ణయానికి దారితీసి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్స్ మరియు వైద్య రికార్డులను పరిశీలిస్తూ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు