బీడీ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకుండా, వారు విద్యాపరంగా రాణించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులకు ప్రత్యేక ఉపకారవేతనాలను (స్కాలర్షిప్స్) అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ప్రారంభమైనందున, అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఈ పథకం కింద 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే (ప్రీ-మెట్రిక్) విద్యార్థులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ వంటి ఉన్నత/ప్రొఫెషనల్ కోర్సులు (పోస్ట్-మెట్రిక్) చదివే రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు బీడీ రంగంలో కనీసం 6 నెలల పని అనుభవం కలిగి ఉండటంతో పాటు, వారి కుటుంబ నెలవారీ ఆదాయం రూ. 10,000 మించకూడదు.
ఈ పథకంలో భాగంగా విద్యార్థులు చదువుతున్న తరగతిని బట్టి ఏడాదికి రూ. 1,000 నుండి గరిష్టంగా రూ. 25,000 వరకు ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) అధికారిక వెబ్సైట్ ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) మరియు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియలను పూర్తి చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు దరఖాస్తు చేయడానికి ఆగస్టు 31, 2026 చివరి తేదీ కాగా, ఉన్నత చదువులు చదివే పోస్ట్-మెట్రిక్ విద్యార్థులకు అక్టోబర్ 31, 2026 వరకు గడువు పొడిగించారు.









