ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ బంగారం గని వెలుగుచూసింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ పరిధిలో విస్తారమైన బంగారం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు. ఈ పరిణామంతో కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కుప్పం ప్రాంతం త్వరలోనే సరికొత్త మైనింగ్ హబ్గా మారబోతోందనే వార్తలు స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
కుప్పం ప్రాంతంలో బంగారం గనులు బయటపడటానికి గల భౌగోళిక కారణాలను శాస్త్రవేత్తలు వివరించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) కు కుప్పం భౌగోళికంగా అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోలార్లోని ప్రధాన గోల్డ్ మైనింగ్ బెల్ట్ కుప్పం సరిహద్దుల దాకా విస్తరించి ఉంటుందని భౌగోళిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. జియోలాజికల్ సర్వే నివేదికల అనంతరం ఇక్కడ త్వరలోనే అధికారికంగా గోల్డ్ మైనింగ్ (బంగారం తవ్వకాలు) ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్లో బంగారం తవ్వకాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభమై విజయవంతంగా సాగుతోంది. అక్కడ గనుల నుంచి తీసిన మేలిమి బంగారం ఇప్పటికే మార్కెట్లోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు అదే తరహాలో కుప్పం మైనింగ్ బెల్ట్ నుంచి కూడా త్వరలోనే భారీ ఎత్తున బంగారాన్ని వెలికితీసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ సరికొత్త మైనింగ్ కారిడార్ ఏపీ పారిశ్రామిక రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది.









