ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. కనీస వేతనం ఫిక్స్..

గ్రామీణ ప్రాంతాల్లోని పేద కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత రెండు దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో సరికొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) – 2025 (వీబీ జీ రామ్ జీ)చట్టాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది. కూలీలకు పనిదినాలు, వేతనాల్లో మార్పులు చేసింది. ఈ నూతన విధానంలో పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు. దేశవ్యాప్తంగా కనీస రోజువారీ వేతనాన్ని రూ.300 నుంచి రూ.409 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సవరించింది. బుధ‌వారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిణి ఆర్.భాజిభాకరే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త వేతనాల ప్రకారం తెలంగాణలో ఉపాధి కూలీల దినసరి వేతనం రూ.308కి పెరిగింది. గ‌తంలో 307 ఉంటే రూపాయి పెరిగింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ వేతనం రూ.307 నుంచి రూ.312కు పెరిగింది.

 

దక్షిణాది రాష్ట్రాల్లో..

దేశంలోని సుమారు 11 రాష్ట్రాల్లో వేతనాలు 15 శాతం వరకు పెరిగాయి. ఈ కొత్త వేతనాల వల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉపాధి హామీ కూలీలకు లబ్ధి చేకూరనుంది. దేశంలోనే అత్యధికంగా సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో జ్ఞాతాంగ్, లాచుంగ్, లాచెన్ గ్రామ పంచాయతీల‌ కూలీలకు రూ. 450 చెల్లించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో రూ. 345, పుదుచ్చేరిలో రూ. 347, లక్షద్వీప్ రూ. 348గా నిర్ణయించారు. సవరించిన వేతనాలు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వ‌స్తాయని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూలీ రూ. 300గా ఉండగా.. అండమాన్ నికోబార్ దీవుల్లో గరిష్టంగా రూ.367 వరకు ఉండనుంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత కూలీలకు కొంత ఊరట ఇవ్వనుంది.

 

నేడు కేబినెట్ భేటీలో కీల‌క నిర్ణయం

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గడువు దేశవ్యాప్తంగా ఈఏడాది జూలై 30తో ముగిసింది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్- గ్రామీణ్ (వీబీజీరామ్జీ) పథకాన్ని కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టింది. అమల్లోకి తీసుకొచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆ పథకం అమలు కోసం కేంద్రం తెలంగాణకు రూ.3,825.31 కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ట్రం తన వాటా కింద 40 శాతం నిధులను కేటాయించాలి. అంటే రూ.2550.21 కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర నిధుల విడుదల ఆగకూడదన్న ప్రధాన ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కొత్త చట్టం అమలుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, జీరామ్జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనికి సంబంధించి శాసనసభలో తీర్మానం చేసింది. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. రెండు సార్లు సమావేశమై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అవ‌స‌ర‌మైతే న్యాయ పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించారు. కొత్త పథకం అమలుపై గురువారం నిర్వ‌హించే క్యాబినేట్ సమావేశంలోఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చకుదారితీసింది.

 

ప‌ని దినాలు 125 రోజులకు పెంపు..

 

ఉపాధి హామీ పథకం కింద గతేడాది కేంద్రం 8.50 కోట్ల పనిదినాలను కేటాయించింది. వాటిలో రాష్ట్రం 8 కోట్ల పనిదినాలను మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన పనిదినాలను ప్రస్తుతం కొనసాగుతున్న మహిళాసంఘాల భవనాలు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, పాఠశాల గదులు, ప్రహరీలు వంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు అనుమతించింది. బుధవారం నుంచి ప్రారంభ‌మైన కొత్త పనులను జీరామ్జీ కిందే చేపట్టాలని కేంద్రం పేర్కొంది. ఈ పథకానికి అనుగుణంగా కొత్త వెబ్సైట్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఉన్న యాప్ల పేరు కూడా జీరామ్జీ కిందికి మార్చనున్నారు. పనుల వివరాలు, కూలీల పేర్లు, మాస్టర్ల నమోదు, వేతనాల చెల్లింపులు, రికార్డులు అన్నీ జీరామ్జీ పథకం కిందనే చేర్చనున్నారు. గ్రామీణ కార్మికులకు కల్పించే ఉపాధి దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు. వేతనాల మధ్య ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వ్యవసాయ సీజన్లో మాత్రం ఉపాధి పథకానికి 2 నెలలు విరామం ఇవ్వనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు