ఏపీలో కాగ్నిజెంట్.. విశాఖ ఐటీ సెజ్‌కు కేంద్రం ఆమోదం..

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించే కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్.. విశాఖపట్నంలో ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు పొందింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జూన్ 25నే తుది నోటిఫై చేసింది.

 

విశాఖపట్నం రూరల్ మండలం పరిధిలోని ఐటీ-మధురవాడ-2 ప్రాంతంలో 8.98 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సెజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి జూన్ 11న కాగ్నిజెంట్ సంస్థకు లెటర్ ఆఫ్ అప్రూవల్ కూడా జారీ అయింది. సెజ్ చట్టం ప్రకారం డెవలప్‌మెంట్ కమిషనర్ నేతృత్వంలో ఒక అప్రూవల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కస్టమ్స్ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ఈ సెజ్‌ను ‘ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో’గా కూడా ప్రకటించడం విశేషం.

 

కొన్ని నెలల క్రితం, ఫిబ్రవరిలో, తెలంగాణలోని నానక్‌రామ్‌గూడ, ఆదిభట్లలో రెండు ఐటీ సెజ్‌ల ప్రతిపాదనలను కాగ్నిజెంట్ వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు విశాఖలో భారీ ప్రాజెక్ట్‌కు అనుమతులు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ఈ ప్రాజెక్ట్‌తో సుమారు రూ.1,580 కోట్ల పెట్టుబడి, దాదాపు 8,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. దశలవారీగా పూర్తిస్థాయి క్యాంపస్‌ను అభివృద్ధి చేయనుండగా, విశాఖపట్నం ఐటీ స్వరూపాన్ని ఈ ప్రాజెక్ట్ సమూలంగా మార్చనుందని నిపుణులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు