తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నిరసనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘గాంధీభవన్’ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి ప్రతిచర్యగా కరీంనగర్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు దూసుకెళ్లడంతో రెండు చోట్లా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు ఎమ్మెల్యే రాకేశ్రెడ్డిలను పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుల సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు రెండు నిరసన ప్రాంతాల్లోనూ భారీగా బలగాలను మోహరించారు.
మరోవైపు కరీంనగర్లో బండి సంజయ్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆఫీస్ ముందే బైఠాయించి నిరసన తెలిపారు. రాజధాని హైదరాబాద్, కరీంనగర్ నగరాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న ఈ పోటాపోటీ ముట్టడి ప్రయత్నాలు, నేతల అరెస్టులు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర వేడిని రగిల్చాయి.









