ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు. తిరుమల శ్రీవారి పర్యటన కోసం వస్తున్న ప్రధాని అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ప్రధానితో గవర్నర్, సీఎం జగన్ తిరుమల పర్యటనలో పాల్గొనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మోదీతో పాటుగా పవన్ హాజరవుతున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 27న తిరుమలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. ఇక, ప్రధానితో భేటీ సమయంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
తిరుమలకు ప్రధాని: ప్రధాని మోదీ నవంబరు 26న సాయంత్రం 6:50 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7:50 గంటలకు తిరుమలకు చేరుకుని.. కొండపై శ్రీరచనా అతిధి గృహంలో బస చేస్తారు.మర్నాడు అంటే నవంబరు 27న ఉదయం 7:55 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఉదయం 8:45 గంటల వరకు ఆలయంలోనే ప్రధాని గడపనున్నారు. స్వామి దర్శనం అనంతరం.. వేద పండితుల ఆశీర్వాదాలు, ప్రసాదం స్వీకరించి ఉదయం 8:55 గంటలకు బయటకు వస్తారు. దర్శనం ముగించుకుని తిరిగి శ్రీరచనా అతిధి గృహానికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుని ఉదయం 9:30 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి వెళ్తారు.
తిరుపతికి సీఎం జగన్: ప్రధాని పర్యటనలో గవర్నర్, సీఎం జగన్ పాల్గొంటారని సమాచారం. తిరుపతి చేరుకున్న సమయం నుంచి తిరుగు ప్రయాణం వరకు పాల్గొనున్నారు. ఇక, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ తో కలిసి ప్రధాని బహిరంగ సభ -రోడ్ షో లో పాల్గొంటారు. ఏపీలో జనసేన – టీడీపీ మధ్య పొత్తు కొనసాగుతోంది.
తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో రాజకీయం పైన బీజేపీ ఫోకస్ చేయనున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో పొత్తుల పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, తెలంగాణలో బీజేపీ -జనసేన సాధించే ఓట్లు..టీడీపీ మద్దతు దారుల ఓట్లు ఎవరికి పోల్ అయ్యాయనే అంశం ఇక్కడ కీలకంగా మారుతోంది. తెలంగాణలో బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ..ఏపీలో కాపు సీఎం నినాదంతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
మారుతున్న సమీకరణాలు: ఇక, ఇప్పుడు తిరుపతికి వచ్చిన ప్రధానితో సీఎం కలిసినా..మర్యాద పూర్వకం మినహా రాజకీయ అంశాల చర్చకు అవకాశాలు తక్కవని చెబుతున్నారు. అయితే, ఇద్దరి మధ్య తాజా అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 8వ తేదీ నుంచి సీఎం జగన్ ప్రతీ నెల 2 రోజుల పాటు విశాఖ నుంచే పాలన చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో పాటుగా చంద్రబాబు కేసులు..పరిణామాల పైన చర్చ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5,6 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమచారాం. ఇక, డిసెంబర్ తొలి వారం నుంచే ఏపీ ఎన్నికల రాజకీయం వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం ఆసక్తికరంగా మారుతోంది.









