మద్యం దుకాణాలను పెంచుతూ పోతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య పెరిగిపోతుండడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎటువంటి నియమనిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా పెరుగుతున్న మద్యం దుకాణాల సంఖ్య పై జస్టిస్ విజయసేన్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై హైకోర్టును స్థానికులు ఆశ్రయించిన నేపథ్యంలో, ఆ కేసు విచారణ సమయంలో జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు . మద్యం దుకాణాల నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ, విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కనీసం రహదారిపైకి కనిపించకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని, మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి వ్యాఖ్యనించారు. నాగారం మున్సిపాలిటీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని మున్సిపల్, ఎక్సైజ్ అధికారులకు, షాపు యజమానులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.కనీసం రోడ్ల మీద కాకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అయినా ఇలా ప్రతి వీధిలో మద్యం దుకాణాలను పెట్టుకుంటూ పోతే రాష్ట్రం పేరు మార్చాల్సి వస్తుందని హైకోర్టు న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి అసహనం వ్యక్తంచేశారు









