కూడు,గూడు, వస్త్రం ఇవి మానవుని కనీస అవసరాలు….వీటి కోసం సామాన్యుడు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నాడు…ధనవంతుల విషయం పక్కన పెడితే,పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు స్వంత ఇంటి కల అనేది అందని ద్రాక్షగానే మిగిలి పోనుందా అనే సందేహం కలుగుతోంది.పట్టణాల్లో అందునా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పేద, మధ్య తరగతికి భూములు అందనంత దూరంలో ఉన్నాయి.కోకాపేట భూములు ఎకరానికి 150 కోట్లకు చేరుకున్నాయి. ఈ సారి వేలంలో అది రెండు వందల కోట్లకు చేరుకోవచ్చు. అందరూ ఇది రియల్ భూమ్ అని ఆహో..ఓహో అని చెప్పుకోవచ్చు. కాగా అసలు విషాదం ఏమిటంటే..సొంత ఇల్లు కొనాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజల కలలు ఈ వేలం వెర్రి కింద నలిగిపోతున్నాయి. ప్రభుత్వాల కక్కుర్తి వల్ల కరిగిపోతున్న తమ కలలను చూసిన వారు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అంతకు మించి వారేం చేయలేని పరిస్థితిని ప్రభుత్వాలే స్వయంగా కల్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్ లో ఇల్లు కొనలేకపోతున్న సామాన్యుడు..

వెయ్యి ఎస్ఎఫ్టీతో ఓ డబుల్ బెడ్ రూం ఇల్లు కొనుగోలు చేయడం ఇప్పుడు మధ్యతరగతికి అసాధ్యంగా మారింది. ఓ పదేళ్ల కిందటి వరకూ ఇరవై లక్షల రూపాయలు లోన్ పెట్టుకుంటే ఇల్లు వచ్చేది. కానీ ఇప్పుడు 90 లక్షలు అప్పు చేస్తే కానీ ఇల్లు లభించడం లేదు. ఈ 90 లక్షలు బడా బిల్డర్లు కట్టే స్కై స్క్రాపర్లలో కొనేందుకు కాదు. అలాంటి చోట్ల కనీసం మూడు నుంచి నాలుగు కోట్లు ఉంటుంది. పెద్దగా సౌకర్యాలు ఉండని అపార్టుమెంట్లలలోనే ఈ 90 లక్షల ఖర్చు అవుతోంది. అంటే నెలకు లక్ష సంపాదించే ఉద్యోగి కూడా ఇల్లు కొనలేడు. మరి అంత కంటే తక్కువ జీతాలు సంపాదించేవారు ఎలా కొనగలరు…? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వేలం వేసి మరీ భూముల ధరలను పెంచుతున్న ప్రభుత్వాలు…
ఇళ్ల రేట్లు ఎందుకు ఇలా పెరుగుతున్నాయంటే దానికి కారణం భూముల దరలే. 150 కోట్లకు ఎకరం భూమి కొంటే.. అందులో ఇళ్లు కట్టి ఎంతకు అమ్మితే గిట్టుబాటు అవుతుంది ?. ఆ స్థాయిలోనే ధరలు ఖరారు చేస్తారు. ఇప్పుడు కోకాపేటలో నాలుగైదు కోట్లకు ఓ అపార్టుమెంట్ ఫ్లాట్ పలుకుతోందంటే దానికి కారణం భూమి ధరలే అని చెప్పాలి. అదే భూమి ధరలు తక్కువగా ఉంటే.. బిల్డర్లు తమ మార్జిన్ చూసుకుని దానికి తగ్గట్లుగా రేట్లు ఖరారు చేస్తారు. అలా జరగక పోవటం, ప్రభుత్వాలు ఆదాయం కోసం.. వేలం వెర్రిగా స్థలాలను పోటాపోటీగా రేట్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నాయనేది ఎవరూ కాదనలేని నిజం.
ఇది రియల్ భూమ్ కాదు గాలి బుడగ అంటున్న విశ్లేషకులు..

ఇలా రేట్లు పెరిగిపోవడం రియల్ భూమ్ అని చాలా మంది విశ్లేషిస్తున్నారు.కాగా ఒకరిద్దరు డబ్బున్నవాళ్లు లగ్జరీ ఇళ్లు కొనడం బూమ్ ఎలా అవుతుంది?.. మార్కెట్ లో ఎవరు ఎక్కువగా ఎలాంటి ఇళ్లు కొంటారో అంచనా వేసి అలాంటి ఇళ్లను అందిస్తేనే బూమ్ వస్తుంది. లేకపోతే ఆ గాలిబుడగ ఎప్పటికైనా పేలిపోతుంది. అయితే మధ్యతరగతి ప్రజలు మాత్రం .. ఈ పరిస్థితుల వల్ల లోన్ ట్రాప్లో పడిపోయి.. నలిగిపోతున్నారు.కూడు,గుడ్డ,గూడు సామాన్యులకు అందిస్తాం అంటూ ప్రభుత్వాలు ప్రజలకు చెపుతూ వస్తోన్న మాటలు నీటి మూటలు కాకుండా చూడాలంటే, ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించాల్సిందే.









