తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపుపై హైకోర్టు అసహనం…

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.జనాభా లేని సామాజిక వర్గానికి సర్పంచ్ స్థానాన్ని ఎలా కేటాయిస్తారని హైకోర్టు మండి పడింది.ఎస్టీ సామాజిక వర్గానికి 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని, దీంతో అసలు ఎస్టీ జనాభా లేని పంచాయతీల్లో కూడా సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలు ఎస్టీలకు కేటాయింపబడ్డాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపద్యంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో కేవలం ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉండగా సర్పంచ్, రెండు వార్డు స్థానాలను వారికి రిజ్వర్ చేశారు.అదే విధంగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో కేవలం 8 మంది ఎస్టీ ఓటర్లు ఉండగా సర్పంచ్ స్థానాన్ని వారికి రిజర్వ్ చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో ఎస్టీ ఓటరు ఒక్కరూ లేకపోయినా సర్పంచ్ స్థానంతో పాటు మూడు వార్డు మెంబరు స్థానాలను ఆ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు.నల్గొండ జిల్లా అనుముల మండలం శివాలయం పేరూరు గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోయినా సర్పంచ్ స్థానంతో పాటు 4 వార్డు మెంబర్లను రిజర్వేషన్ లో కేటాయించారు.అదే విధంగా వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశలపల్లిలో సర్పంచ్, రెండు వార్డు మెంబరు స్థానాలు.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్ పల్లిలో సర్పంచ్, 6 వార్డు మెంబరు స్థానాలను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించారని సింగిల్ బెంచ్ న్యాయమూర్తికి పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు.ఇదే సమయంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలే లేకుండా, వారికి రిజర్వేషన్ కేటాయించడం నిరుపయోగమని, సింగిల్ బెంచ్ న్యాయమూర్తి టీ.మాధవీదేవి వ్యాఖ్యానించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram