ఆరా కొండను ఢీకొట్టిన చార్టర్డ్ విమానం..
ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానం జిల్లాలోని ఆరా కొండను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో ఉన్న పైలట్ మరియు కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం..
ప్రమాద వార్త తెలిసిన వెంటనే జష్పూర్ ఎస్ఎస్పి లాల్ ఉమ్మేద్ సింగ్తో సహా ఉన్నతాధికారులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ, రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. ప్రమాద సమయంలో విమానంలో పైలట్లతో పాటు ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. విమానం శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రమాదానికి గల కారణాలపై విచారణ..
ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల్లో కొండపై విమానం తగలబడుతున్న దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే అంశంపై విచారణ చేపట్టారు. ఏవియేషన్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.








