వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అది హత్యా రాజకీయాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర మంత్రి పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనుక ఆ పార్టీ అగ్రనేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. “చీకట్లో మనుషులను చంపడం, తెల్లారాక వెళ్లి పరామర్శిస్తూ మొసలి కన్నీరు కార్చడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది” అంటూ మంత్రి మండిపడ్డారు. ఈ హత్యోదంతం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
హత్యకు గురైన పెద్ద దస్తగిరి ఇంట్లో జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు లభించడంపై పార్థసారథి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దస్తగిరి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి, రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని గుర్తు చేస్తూ.. ఆస్తుల గొడవల కారణంగానే సొంత పార్టీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని మంత్రి ఆరోపించారు. సామాన్యుల దగ్గర ఉండాల్సిన పత్రాలు దస్తగిరి వద్దకు ఎలా వచ్చాయో విచారణలో తేలాలని డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య నుంచి నేటి పెద్ద దస్తగిరి హత్య వరకు వైసీపీ ఒకే తరహా నాటకాలు ఆడుతోందని మంత్రి విమర్శించారు. అధికారం కోసం, ఆస్తుల కోసం సొంత మనుషులను కూడా బలితీసుకునే నైజం ఆ పార్టీదని ధ్వజమెత్తారు. ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడే పార్టీకి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని, వైసీపీ గుర్తింపును రద్దు చేసే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అండ్ కో చేస్తున్న పాపాలను ప్రజలు ఎన్నటికీ క్షమించరని పార్థసారథి స్పష్టం చేశారు.









