దేశ ఐటీ రాజధాని బెంగళూరులో సభ్య సమాజం తలదించుకునేలా ఒక కిరాతక ఘటన వెలుగుచూసింది. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటాడనే అనుమానంతో, ఒక యువతి తన ప్రియుడిని నమ్మించి ఇంటికి పిలిచి, అత్యంత క్రూరంగా సజీవ దహనం చేసింది. ఈ ఘటనలో కిరణ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, ప్రేరణ అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రేరణ, కిరణ్ గత ఏడాది కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే ఇటీవల కిరణ్ తనను దూరం పెడుతున్నాడని భావించిన ప్రేరణ, అతడిని అంతమొందించాలని పథకం వేసింది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్ను పిలిపించి, “విదేశాల్లో మాదిరిగా కొత్త స్టైల్లో నీకు ప్రపోజ్ చేస్తాను” అని నమ్మబలికింది. అతడి కళ్లకు గంతలు కట్టి, ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసింది. ప్రియుడు ఏదో సర్ ప్రైజ్ ఉంటుందని నమ్మగా, ఆమె ముందుగానే సిద్ధం చేసుకున్న కిరోసిన్ను అతడిపై పోసి నిప్పంటించింది.
కిరణ్ మంటల్లో కాలిపోతూ ప్రాణభయంతో అరుస్తున్నా కనికరించని ప్రేరణ, ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్లో వీడియో తీస్తూ రాక్షసానందం పొందింది. తొలుత ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ, పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. ఘటనా స్థలంలో కిరోసిన్ డబ్బా లభించడం, ఫోన్లోని వీడియో ఆధారంగా ఆమెను నిందితురాలిగా నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









