పవన్ కళ్యాణ్ గెలుపు మొక్కుతో పిఠాపురంలో షూటింగ్: తండ్రీకూతుళ్ల అనుబంధంగా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’

: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన నూతన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన అనుబంధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు మహేష్ చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 1న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సినిమా షూటింగ్ పిఠాపురంలో జరపడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉందని నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ తెలిపారు. దర్శకుడు మహేష్ చంద్ర పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని, పవన్ పిఠాపురంలో గెలిస్తే అక్కడే సినిమా తీస్తానని మొక్కుకున్నారని ఆయన వెల్లడించారు. ఆ మాట ప్రకారమే చిత్రంలోని 75 శాతం షూటింగ్‌ను పిఠాపురంలోనే పూర్తి చేశామని చెప్పారు. అయితే సినిమా పేరులో పిఠాపురం ఉన్నప్పటికీ, ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవని, ఇది కేవలం స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రమని నిర్మాతలు స్పష్టం చేశారు.

రాజేంద్ర ప్రసాద్ తన నటనతో మరోసారి మ్యాజిక్ చేశారని, ఈ సినిమా చూసి ప్రేక్షకులు కచ్చితంగా ఎమోషనల్ అవుతారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటికే నిర్వహించిన కొన్ని ప్రీమియర్ షోలలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, మౌత్ టాక్‌తో ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, కేదార్ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు