తెలంగాణ రాజకీయాల్లో కొత్త శకం: 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఈ నెల 25వ తేదీన కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆమె, ప్రస్తుతం ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కేవలం బల ప్రదర్శనలకే పరిమితమై ప్రజల అసలైన సమస్యలను విస్మరించాయని మండిపడ్డారు. తన కొత్త పార్టీలో యువతకే పెద్ద పీట వేస్తామని, నవతరం ఆలోచనలతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

జగిత్యాల బీఆర్ఎస్ సభలో 75 ఏళ్ల జీవన్ రెడ్డిని నవ యువకుడని అభివర్ణించడంపై కవిత ఘాటుగా స్పందించారు. “75 ఏళ్ల వృద్ధులే నవ యువకులైతే, మరి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత పరిస్థితి ఏంటి? వారంతా చచ్చిపోయారా?” అని నిలదీశారు. రాజకీయాల్లో యువ రక్తానికి ప్రాధాన్యత లేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తన పార్టీ తలుపులు అవకాశాల కోసం వేచి చూస్తున్న ప్రతి యువకుడి కోసం తెరిచే ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం ఉండదని, వేయి ఏళ్లయినా ఆ పార్టీ తీరు మారదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా కవిత తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేస్తాననడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వచ్చే పదేళ్ల పాటు తానే సీఎంనని చెప్పుకోవడం ప్రజలను కించపరచడమేనని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆడబిడ్డగా, ప్రజల ఎజెండాతో ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరుతూ, 25న జరిగే పార్టీ ప్రకటన సభకు వచ్చే కార్యకర్తలను అడ్డుకోవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు