ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చిత్తు చేశాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న అభిషేక్, స్టేడియం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తన ఫామ్ కొనసాగిస్తూ, ఆరెంజ్ ఆర్మీకి అద్భుతమైన స్కోరును అందించాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం తప్పని సన్రైజర్స్ ఓపెనర్లు నిరూపించారు. అభిషేక్ శర్మ (135 నాటౌట్), ట్రావిస్ హెడ్ (37) తొలి వికెట్కు 97 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. అభిషేక్ తన ఇన్నింగ్స్లో మొత్తం 10 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు బాది ఉప్పల్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసిన ప్రతి మ్యాచ్లోనూ భారీ స్కోర్లు సాధిస్తుండటం విశేషం.
నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ (25), హెన్రిచ్ క్లాసెన్ (37 నాటౌట్) తమ వంతు సహకారాన్ని అందించారు. క్లాసెన్ ఆఖర్లో మూడు భారీ సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ను కట్టడి చేసేందుకు సన్రైజర్స్ బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. అభిషేక్ శర్మ వీరబాదుడుతో స్టేడియం మొత్తం ‘రీ సౌండ్’ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.









