కేరళలో ఘోర ప్రమాదం: బాణాసంచా కేంద్రంలో పేలుడు.. 13 మంది మృతి

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ముండతికోడ్ ప్రాంతంలోని ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించగా, మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. త్రిస్సూర్‌లో త్వరలో జరగనున్న ప్రఖ్యాత ‘త్రిస్సూర్ పూరం’ ఉత్సవాల కోసం భారీ ఎత్తున బాణాసంచా సిద్ధం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల కిలోమీటరు మేర భూమి కంపించినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనం కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులలో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులను త్రిస్సూర్ మెడికల్ కాలేజీ సహా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తక్షణమే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితమే తమిళనాడులో ఇటువంటి ప్రమాదంలో 25 మంది చనిపోయిన ఘటన మరవకముందే కేరళలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. అసలు ప్రమాదం ఎలా జరిగింది? నిబంధనల ఉల్లంఘన ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉత్సవాల వేళ జరిగిన ఈ విషాదం కేరళలో విషాద ఛాయలు నింపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు