అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్న వేళ, ఇరాన్ ఒక కీలకమైన వ్యూహాత్మక విజయాన్ని నమోదు చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా నౌకాదళం కట్టుదిట్టమైన దిగ్బంధనం కొనసాగిస్తున్నప్పటికీ, దానిని తప్పించుకుని 20 లక్షల బ్యారెళ్ల చమురుతో కూడిన ఇరాన్ సూపర్ ట్యాంకర్ విజయవంతంగా స్వదేశీ జలాల్లోకి ప్రవేశించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
ట్యాంకర్ ట్రాకింగ్ గణాంకాల ప్రకారం, నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఈ నౌక మార్చి చివరి వారంలో ఇరాన్ నుంచి ఆగ్నేయాసియాకు బయలుదేరింది. ఇండోనేషియాలోని రియూ ద్వీపాల వద్ద తన వద్ద ఉన్న చమురును మరొక సూపర్ ట్యాంకర్లోకి బదిలీ చేసింది. తిరుగు ప్రయాణంలో అమెరికా నేవీ దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఐఆర్జీసీ (IRGC) గుర్తించిన సురక్షిత కారిడార్ ద్వారా ఈ నౌక సురక్షితంగా ఇరాన్ తీరానికి చేరుకుంది. దీనిని ఒక గొప్ప విజయంగా అభివర్ణిస్తూ ఇరాన్ అధికారికంగా వీడియోను విడుదల చేసింది.
మరోవైపు, హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు భీతావహంగా ఉన్నాయి. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ముందుకు సాగిన ‘టౌస్కా’ అనే ఇరాన్ సరుకు రవాణా నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి, దానిని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. దీనికి ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేసింది. కాల్పుల విరమణ గడువు మరో 24 గంటల్లో ముగియనున్న తరుణంలో, శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే పర్షియన్ గల్ఫ్లో యుద్ధ మేఘాలు కమ్ముకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.









