పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య తలెత్తిన ఫ్లెక్సీ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేదంటూ టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులను నిలదీయడం, అది కాస్తా జనసేన నేతలతో వాగ్వాదానికి దారితీయడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి నేతల మధ్య సమన్వయం దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదని ఆయన హెచ్చరించారు.
ఈ వివాదంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు, వర్మ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలి కానీ, ఇలా బహిరంగంగా వివాదం చేసి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ప్రోటోకాల్ పేరుతో రచ్చ చేయడం వల్ల కూటమికి నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రానికే ఒక రాజకీయ నమూనా అని, అక్కడ ఇరు పార్టీల నేతలు పాలు-నీళ్లలా కలిసి ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో గొడవలు పడకుండా, వెంటనే వర్మతో మాట్లాడి పరిస్థితిని సర్దుబాటు చేయాలని పల్లా శ్రీనివాస్కు సూచించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మరియు నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.









