హర్మూజ్ జలసంధిలో అమెరికా నేవీ విధిస్తున్న కఠిన దిగ్బంధనం అంతగా ప్రభావం చూపడం లేదని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చామని ప్రకటించినప్పటికీ, ఇరాన్కు చెందిన సుమారు 34 చమురు ట్యాంకర్లు అమెరికా దళాల కళ్లుగప్పి తప్పించుకున్నాయి. ఇందులో 19 ట్యాంకర్లు గల్ఫ్ నుంచి బయటకు వెళ్లగా, మిగిలినవి లోపలికి ప్రవేశించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
ఈ విధంగా తప్పించుకున్న నౌకలలో కనీసం ఆరు ట్యాంకర్లు సుమారు 10.7 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ క్రూడాయిల్ను రవాణా చేస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు విక్రయించినా, వీటి ద్వారా ఇరాన్ సుమారు 910 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 8,435 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించినట్లు అంచనా. ముఖ్యంగా ఇరాన్ జెండా కలిగిన ‘డోరేనా’ అనే సూపర్ట్యాంకర్ తన గుర్తింపును దాచే ట్రాన్స్పాండర్ను ఆఫ్ చేసి, అత్యంత చాకచక్యంగా అమెరికా నిఘా నుంచి తప్పించుకోవడం గమనార్హం.
మరోవైపు, హర్మూజ్ జలసంధి తమ ప్రాదేశిక జలాల పరిధిలోకి వస్తుందని, అక్కడ ప్రయాణించే పౌర నౌకలు తమ అనుమతి తీసుకోవాలని ఇరాన్ షరతులు విధిస్తోంది. అమెరికా ఆంక్షల పర్వం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ తన చమురు ఎగుమతులను కొనసాగించడం ద్వారా పశ్చిమ దేశాల వ్యూహాలకు సవాలు విసురుతోంది. ఇదే సమయంలో హర్మూజ్ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడం వంటి ఘటనలు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.









