పులివెందుల పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆశీర్వచనాలు అందించడం టీటీడీలో పెను దుమారం రేపుతోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి చెందిన ముగ్గురు అర్చకులు (ఎ. శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, కె. పార్థసారథి) ఉన్నతాధికారుల అనుమతి లేకుండా జగన్ను కలవడం చర్చనీయాంశమైంది. టీటీడీ నిబంధనల ప్రకారం, అర్చకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి, కానీ ఇక్కడ అది జరగలేదని అధికారులు గుర్తించారు.
కేవలం ఆశీర్వచనం ఇవ్వడమే కాకుండా, ఆలయానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన శేష వస్త్రాన్ని, రాములోరి తోమాలను, ముత్యాల తలంబ్రాలను వారు జగన్కు అందజేశారు. సాధారణంగా ఇవి ప్రభుత్వం తరపున అధికారికంగా లేదా ప్రోటోకాల్ ప్రకారం అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులకు అందజేయాల్సి ఉంటుంది. అర్చకులు తమ స్వంత నిర్ణయంతో వీటిని తీసుకువెళ్లి అందజేయడం టీటీడీ నిబంధనలకు విరుద్ధమని, ఇది వారి ‘అత్యుత్సాహమే’నని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన టీటీడీ ఉప కార్యనిర్వహణాధికారి ఎ. ప్రశాంతి సంబంధిత అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాజకీయ నాయకుల నివాసాలకు వెళ్లి ఆశీర్వచనాలు అందిస్తూ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను రెండు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అర్చకులు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.









