ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ రాకపోవడానికి నేనే కారణం: వాజ్‌పేయి చెప్పిన నిజాన్ని బయటపెట్టిన లక్ష్మీపార్వతి!

తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ దక్కకపోవడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ఎన్టీఆర్‌కు ఈ గౌరవం దక్కకపోవడానికి వెనుక ఉన్న అసలు కారణం తానేనని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా తనతో చెప్పారని వెల్లడించారు. ఈ పురస్కారాన్ని ఎన్టీఆర్ తరపున లక్ష్మీపార్వతి అందుకోవడం ఆయన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, అందుకే వారు దీన్ని అడ్డుకుంటున్నారని వాజ్‌పేయి వివరించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న తీసుకురావాలని తాను గతంలో ఎంతో ప్రయత్నించానని, మాజీ ప్రధానులు దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌లను కూడా కలిసి విన్నవించానని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు. కోటి సంతకాలను సేకరించి అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు కూడా అందజేశానని ఆమె తెలిపారు. అయితే, కుటుంబ సభ్యుల అభ్యంతరాల వల్లే ఆ పురస్కారం ఆగిపోయిందని, అప్పటివరకు తాను ఎంతో అమాయకంగా అందరినీ కలుస్తూ ప్రయత్నం చేశానని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ (TDP) వైఖరిని కూడా ఆమె తీవ్రంగా ఎండగట్టారు. ప్రతి ఏటా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానాలు చేయడం, ఆ తర్వాత వాటిని చెత్తబుట్టలో వేయడం టీడీపీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే భారతరత్న అంశాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. తన తండ్రికి రావాల్సిన పురస్కారం కోసం కృషి చేయాలని అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణను కూడా తాను కోరినట్లు లక్ష్మీపార్వతి వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు