అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ‘మీమ్’ యుద్ధానికి దారితీశాయి. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ ఆయనను ఎగతాళి చేస్తూ ఒక ఏఐ (AI) వీడియోను పంచుకుంది. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో వ్యంగ్యంగా చిత్రీకరించారు.
ఈ 45 సెకన్ల ఏఐ వీడియోలో ట్రంప్ తన బృందంతో కలిసి ఇరాన్ ప్రతినిధుల కోసం ఎదురుచూస్తున్నట్లు చూపించారు. ఇరానీయులు చర్చలకు రాకపోవడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేయడం, ఆపై ఒక సహాయకుడు వచ్చి ఆయనకు ఒక నోట్ అందించడం ఈ వీడియోలో ప్రధానాంశం. ఆ నోట్పై “నోరు మూసుకో.. ట్రంప్” అని రాసి ఉండటం, దానికి స్పందనగా ఆయన పాకిస్థాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగిస్తానని చెప్పి గదిలో నుంచి బయటకు వెళ్లిపోవడం హాస్యాస్పదంగా చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం ఇరాన్ మరియు భారత సోషల్ మీడియా సర్కిల్స్లో వైరల్గా మారింది.
వాస్తవానికి, యుద్ధం ముగింపునకు సంబంధించి ఇరాన్ నాయకత్వానికి మరింత సమయం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన అభ్యర్థన మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇరాన్ మాత్రం చర్చల విషయంలో అమెరికా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్లో జరగనున్న తదుపరి విడత శాంతి చర్చల్లో పాల్గొనడంపై తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు అటు దౌత్యపరంగా, ఇటు సోషల్ మీడియా వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్న దూరాన్ని స్పష్టం చేస్తున్నాయి.








