గుజరాత్లోని ఛోటా ఉదైపూర్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. రస్లీ గ్రామానికి చెందిన సురేష్ రాథ్వా అనే గిరిజన వ్యక్తి నాలుగేళ్ల కూతురు ఇంటి వెనుక ఆడుకుంటుండగా, అడవిలో నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఓ చిరుతపులి చిన్నారిపై దాడి చేసింది. పాప మెడను దవడలతో కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ దృశ్యం చూసిన తల్లి భయంతో అక్కడికక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. అయితే, తండ్రి సురేష్ మాత్రం ఏమాత్రం భయపడకుండా తన బిడ్డ ప్రాణాలు దక్కించుకునేందుకు సింహంలా మారి చిరుతపైకి దూకాడు.
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సురేష్ ఒట్టి చేతులతో పులి దవడలను బలవంతంగా విడదీసి తన బిడ్డను విడిపించాడు. ఒక చేత్తో చిన్నారిని గట్టిగా పట్టుకుని, మరో చేత్తో ఆ క్రూర మృగంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో చిరుత తన పంజాతో దాడి చేసినప్పటికీ సురేష్ వెనక్కి తగ్గలేదు. సుమారు ఐదు నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటంలో సురేష్ తెగింపును చూసి హడలిపోయిన ఆ చిరుతపులి.. చివరికి తన పట్టును సడలించి బిడ్డను వదిలేసి పొలాల్లోకి పారిపోయింది.
ఈ దాడిలో చిన్నారి ముఖం, మెడ భాగాల్లో తీవ్ర గాయాలు కాగా, తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు, చిన్నారి చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తన బిడ్డ కోసం సురేష్ చేసిన సాహసాన్ని అటవీ శాఖ అధికారులు సైతం తీవ్రంగా కొనియాడారు. ఆహారం కోసం గ్రామంలోకి వచ్చిన ఈ చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, గ్రామం చుట్టూ మూడు బోన్లతో పాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.









