ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. రాత్రికి రాత్రే ఇంధన కొరత ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగడంతో, వాహనదారులు బంకుల వద్దకు పరుగులు పెట్టారు. కర్నూలు, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. పలు చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండగా, కొన్ని బంకుల్లో రేషన్ పద్ధతిలో (కార్లకు 10 లీటర్లు, లారీలకు 50 లీటర్లు మాత్రమే) ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. రబీ కోతల సీజన్ కావడంతో డీజిల్ దొరకక రైతులు, ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇచ్చే ‘క్రెడిట్ ఆప్షన్’ను రద్దు చేయడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో డీలర్లు ముందస్తుగా నగదు చెల్లించి స్టాక్ తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వ్యవసాయ సీజన్ కావడంతో డీజిల్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడం సరఫరా చైన్పై ఒత్తిడి పెంచింది. అధికారులు ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాహనదారులు గంటల తరబడి ఎండలో వేచి చూడాల్సి వస్తోంది.
పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. గత ఏప్రిల్తో పోలిస్తే 10 శాతం అదనపు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు కంగారు పడి అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని, ఏదైనా సమస్య ఉంటే 1967 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. ప్రతి జిల్లాలో కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తూ సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నారు.









