ఢిల్లీ హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఒక అసాధారణమైన మరియు అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒక కేసుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతుండగా, అకస్మాత్తుగా స్క్రీన్పై అశ్లీల వీడియోలు ప్లే అయ్యాయి. మధ్యాహ్నం సుమారు 12:56 గంటల సమయంలో జరిగిన ఈ పరిణామంతో న్యాయమూర్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అధికారులు వెంటనే అప్రమత్తమై విచారణను నిలిపివేశారు.
కాసేపటి తర్వాత విచారణను మళ్ళీ ప్రారంభించగా, అదే విధంగా అశ్లీల కంటెంట్ పునరావృతమైంది. అంతేకాకుండా, స్క్రీన్పై ‘మీరు హ్యాక్ అయ్యారు’ అనే సందేశం కూడా కనిపించడంతో పరిస్థితి తీవ్రతను గమనించిన న్యాయమూర్తులు వర్చువల్ విచారణను పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటన కేవలం ప్రధాన న్యాయమూర్తి కోర్టుకే పరిమితం కాలేదని, మరికొన్ని ఇతర కోర్టు హాల్స్లో కూడా ఇలాగే జరిగిందని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చీఫ్ జస్టిస్, రిజిస్ట్రార్ జనరల్ను కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగం IFSO (Intelligence Fusion and Strategic Operations) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక విచారణలో ‘శ్రీధర్ సర్నోబత్’, ‘షిత్జీత్ సింగ్’ అనే రెండు అకౌంట్ల నుంచి ఈ వీడియోలు ప్లే అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తన అకౌంట్ అమెరికా నుంచి హ్యాక్ అయిందని షితిజిత్ సింగ్ పేర్కొన్నారు. హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ఇంటర్ఫేస్పై వ్యవస్థీకృత సైబర్ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా టెక్నికల్ టీమ్ కోర్టు నెట్వర్క్ను నిశితంగా పరిశీలిస్తోంది.









