బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లింగ్ వండర్ ‘ధురంధర్’ (పార్ట్ 1) ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం, జులై 10న జపాన్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలైన జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ అధికారికంగా ప్రకటిస్తూ, జపనీస్ భాషలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశాయి. “ఇక జపాన్ ఈ ధురంధర్ ఎనర్జీని చూసే సమయం వచ్చింది” అంటూ సినిమా టీమ్ ఉత్సాహం వ్యక్తం చేస్తోంది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, 2025 డిసెంబర్లో విడుదలై అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹1,328 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, విదేశీ మార్కెట్లో అత్యంత విజయవంతమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ నంబర్ 1 హిందీ చిత్రంగా రికార్డు సృష్టించడమే కాకుండా.. కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, భారతదేశంపై కుట్ర పన్నుతున్న ఉగ్రవాద నెట్వర్క్ను ఛేదించడానికి పాకిస్థాన్లోని కరాచీకి వెళ్లిన ఒక అండర్కవర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. యదార్థ రాజకీయ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ స్పై డ్రామాలో రణ్వీర్ సింగ్తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం నటించారు. అంతర్జాతీయంగా ఘనవిజయం సాధించిన ఈ చిత్రం జపాన్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.









