ఏపీలో ఇంధన సంక్షోభం: ప్రభుత్వంపై షర్మిల ధ్వజమెత్తు

రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాన్య ప్రజలు, వాహనదారులు గంటల తరబడి ఫ్యూయల్ స్టేషన్ల వద్ద క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆమె విమర్శించారు. ప్రజా అవసరాలను గాలికి వదిలేసి, ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం అమరావతి నిర్మాణ పనులకే ప్రాధాన్యత ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీజిల్ కొరత కారణంగా రైతులు పొలాల్లో పనులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు ఇంధనం దొరకని పరిస్థితి ఉంటే, బడా కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా డీజిల్ కోటాను కేటాయించడం వారి వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కంటే కాంట్రాక్టర్ల లాభాలకే పెద్దపీట వేస్తోందని ఆమె మండిపడ్డారు.

తక్షణమే స్పందించి సామాన్యులకు, రైతులకు ఇంధనం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేవలం నిర్మాణ పనులపైనే దృష్టి పెడితే భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా పాలనలో ప్రాధాన్యతలు మార్చుకుని, ప్రజల కష్టాలను తీర్చడమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకోవాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు