చదువుకోవాలనే ఆశ, పట్టుదల ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా విజయం సాధించవచ్చని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ నిరూపించారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆరో తరగతిలోనే చదువు ఆపేసిన ఆమె, పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. అయితే తన కుమారుడు పదో తరగతికి రావడంతో, చదువుపై ఉన్న మక్కువతో ఆమె కూడా కొడుకుతో కలిసి మళ్ళీ పుస్తకాలు పట్టి పరీక్షలకు సిద్ధమయ్యారు.
పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామానికి చెందిన బండారు లక్ష్మీ లహరి కొన్ని కారణాల వల్ల గతంలో చదువును మధ్యలోనే నిలిపివేశారు. తన కుమారుడు శరణ్ విజయ్ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తుండటంతో, ఆమె కూడా ఓపెన్ స్కూల్లో చేరి పరీక్షలు రాశారు. కొడుకు చదువుతుంటే ఆమె కూడా పక్కనే కూర్చుని పుస్తకాలతో కుస్తీ పట్టి రావులపాలెం కేంద్రంలో పరీక్షలకు హాజరయ్యారు.
గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఈ తల్లీకొడుకులు ఇద్దరూ ఉత్తీర్ణులై అందరినీ ఆశ్చర్యపరిచారు. కుమారుడు శరణ్ విజయ్ 600 మార్కులకు గాను 562 మార్కులు (94%) సాధించగా, తల్లి లక్ష్మీ లహరి 500 మార్కులకు గాను 360 మార్కులు (60%) సాధించి విజయం సాధించారు. గృహిణిగా ఉంటూ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చదువులో రాణించిన లక్ష్మీ లహరిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రశంసలతో ముంచెత్తారు.









