నటుడు, దర్శకుడు రవిబాబు తెలుగు సినీ పరిశ్రమ తీరుపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తన తాజా చిత్రం ‘రేజర్’ మే 8న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన మీడియా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో క్రమశిక్షణ, బాధ్యత పూర్తిగా తగ్గిపోయాయని ఆయన ఆరోపించారు. సమయానికి, డబ్బుకు విలువ ఇవ్వకుండా సినిమాలు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గతంలో ఫిల్మ్ (రీల్) మీద షూటింగ్ చేసే రోజులను రవిబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రతి అడుగు ఎంతో ఖరీదైనదని, అందుకే నటీనటుల నుండి సాంకేతిక నిపుణుల వరకు అందరూ ఎంతో అంకితభావంతో, బాధ్యతతో పనిచేసేవారని తెలిపారు. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ కావడంతో చిప్ తీయడం, డేటా తుడిచేయడం సులభమైపోయిందని, దీనివల్ల సరైన ప్లానింగ్ లేకుండా షూటింగ్లు జరుగుతున్నాయని విమర్శించారు. “నిజం చెప్పాలంటే, ఇప్పుడు సినిమాలు తీసేవాళ్లు ఒళ్లు బలిసి తీస్తున్నారు” అని ఆయన అన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి.
రవిబాబు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వాడిన పదజాలంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన అన్నదాంట్లో పచ్చి నిజం ఉందని సమర్థిస్తున్నారు. విచ్చలవిడిగా బడ్జెట్లు పెంచేస్తూ నిర్మాతల కొంప ముంచుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రవిబాబు వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయని వారు వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ వివాదం ఆయన కొత్త సినిమా ‘రేజర్’ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.









