ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటుచేసుకున్న ఒక వివాదాస్పద ఘటన న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కోర్టు విచారణ సమయంలో ఒక ఉత్తర్వు ప్రతిని సమర్పించలేదనే కారణంతో, జస్టిస్ టి. రాజశేఖరరావు ఒక యువ న్యాయవాదిని 24 గంటల పాటు పోలీసు కస్టడీకి పంపాలని ఆదేశించారు. సదరు న్యాయవాది పదేపదే క్షమాపణలు కోరినప్పటికీ, న్యాయమూర్తి కనికరం లేకుండా వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత బార్ కౌన్సిల్ (BCI) ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది.
ఈ ఘటనపై స్పందించిన బి.సి.ఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)కి ఘాటుగా లేఖ రాశారు. కేవలం విధానపరమైన లోపం జరిగినందుకు ఒక న్యాయవాదిని జైలుకు పంపాలని చూడటం న్యాయవ్యవస్థకు ఉండాల్సిన సంయమనం మరియు గౌరవానికి విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు యువ న్యాయవాదుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, బెంచ్ మరియు బార్ మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవానికి ఇది గొడ్డలి పెట్టు వంటిదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వివాదం నేపథ్యంలో బి.సి.ఐ ప్రధానంగా మూడు డిమాండ్లను సుప్రీంకోర్టు ముందు ఉంచింది. సదరు న్యాయమూర్తి నుండి వెంటనే న్యాయ విధులను ఉపసంహరించుకోవాలని, ఆయనను తక్షణమే సుదూర ప్రాంతంలోని వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. అంతేకాకుండా, కోర్టు నిర్వహణ మరియు న్యాయమూర్తులకు ఉండాల్సిన నిగ్రహంపై ఆయనకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ వ్యవహారంపై తక్షణ పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించింది.









