ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2,13,000 కోట్ల విలువైన 25 భారీ ప్రాజెక్టులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 39,067 మంది యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ రూ.1.08 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ రాష్ట్ర ఐటీ రంగంలోనే ఒక మైలురాయిగా నిలవనుంది.
ఈ సమావేశంలో ఇంధన రంగానికి పెద్దపీట వేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో రిలయన్స్ సంస్థ రూ.51,300 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టును, కడప జిల్లాలో అదానీ గ్రూప్ రూ.12,297 కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నాయి. అలాగే తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమ (రూ.2,508 కోట్లు), అపోలో టైర్స్ (రూ.6,100 కోట్లు) వంటి దిగ్గజ సంస్థల విస్తరణకు ఆమోదం లభించింది. గ్రీన్ హైడ్రోజన్, బయో సీఎన్జీ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు కూడా బోర్డు ప్రాధాన్యతనిచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం క్షేత్రస్థాయిలో పెట్టుబడిగా మారాలని అధికారులను ఆదేశించారు. అనుమతుల జారీలో ఏపీ ఒక బ్రాండ్గా ఎదగాలని, ఎక్కడా ఒక్క రోజు కూడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈ (MSME)లకు కూడా సమాన ప్రాధాన్యతనిస్తూ, ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.









