- పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు.
- టెన్త్,ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పిల్లలను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
కొత్త గూడెం మే 7
టుడే 9 ప్రతినిధి
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 63 మంది పోలీస్ సిబ్బంది పిల్లలు,వారి తల్లీదండ్రులు హాజరయ్యారు.ముందుగా మంచి మార్కులు సాధించిన విద్యార్థిని,విద్యార్థులు కొంతమంది తమ తల్లీదండ్రుల కష్టాన్ని,భవిష్యత్తులో తాము సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకుగాను ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. పట్టుదల,క్రమశిక్షణ,ఆత్మ స్థైర్యం ఉంటే ఎలాంటి కష్టమైన లక్ష్యాన్నైనా సులభంగా సాధించవచ్చని అన్నారు.జీవితంలో ఎల్లప్పుడూ పాఠాలను నేర్చుకుంటూనే ఉండాలని, ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు.మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకొని,దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.పోలీస్ కుటుంబంలో పుట్టి పెరిగిన ఎస్పీ గారు బాల్యం నుండి ఐపిఎస్ సాధించే వరకు తన గత స్మృతులను వారితో పంచుకున్నారు.అనంతరం మంచి మార్కులు సాధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు కుటుంబంలోని విద్యార్థినీ,విద్యార్థులకు ఎస్పీ ప్రశంసా పత్రాలతో పాటు మెమొంటోలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు,వన్టౌన్ సీఐ కరుణాకర్,త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి,ఎంటిఓ సుధాకర్, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.









