తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అనూహ్య విజయం సాధించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ నెంబర్ వన్గా నిలవడం, రెండు చోట్ల ఆయన గెలవడాన్ని ఉదహరిస్తూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ను రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన తొలి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం, జనసేన అప్పట్లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమవ్వడాన్ని పోలుస్తూ నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంత జరుగుతున్నా జనసేన పార్టీ నుండి ధీటైన కౌంటర్ ఇచ్చే నాయకులు కరువవ్వడం గమనార్హం. ఒకప్పుడు పార్టీపై విమర్శలు వస్తే తక్షణమే స్పందించే అద్దేపల్లి శ్రీధర్, దిలీప్ సుంకర వంటి వారు ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా లేకపోవడం, బొలిశెట్టి సత్యనారాయణ వంటి వారు దూరంగా ఉండటంతో లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతిలో ఉండటం, కీలక నేత నాదెండ్ల మనోహర్ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి దిశానిర్దేశం చేసే వారు లేకుండా పోయారు. ఐటీ వింగ్ పరంగా కూడా పార్టీ వెనుకబడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ మరియు పవన్ కళ్యాణ్ల సినీ కెరీర్ ఒకేసారి ప్రారంభమవ్వడం, ఒకరి సినిమాలను మరొకరు రీమేక్ చేసుకోవడం వంటి అంశాల వల్ల ఈ పోలికలు సహజంగానే వస్తున్నాయి. అయితే తమిళనాడు, ఏపీ రాజకీయ పరిస్థితులు వేరైనప్పటికీ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టకపోతే పార్టీ కేడర్లో నైతిక స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది. కూటమి నుండి పవన్ను ఏకాకిని చేసే కుట్రలో భాగంగానే ఈ ట్రోలింగ్ జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ అన్ని కమిటీలను త్వరలోనే నియమిస్తామని జనసేన ప్రకటించింది, మరి ఈ కొత్త నాయకత్వం ఏ మేరకు విమర్శలను తిప్పికొడుతుందో చూడాలి.









