ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుస సంక్షోభాల్లో కూరుకుపోతోంది. తాజాగా పంజాబ్కు చెందిన మంత్రి, లుధియానా వెస్ట్ ఎమ్మెల్యే సంజీవ్ అరోరాను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం అరెస్ట్ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సుదీర్ఘ సోదాల అనంతరం ఈ చర్య తీసుకున్నారు.
ఈ అరెస్టుకు ముందు చండీగఢ్, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లోని అరోరాకు చెందిన నాలుగు ప్రదేశాలలో అధికారులు సోదాలు నిర్వహించారు. గత నెలలో కూడా ఆయనపై ఇలాంటి తనిఖీలే జరగగా, ఈ ఏడాదిలో ఆయనపై ఈడీ దాడులు జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 నిబంధనల ప్రకారం ఈ కేసును విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రి అరెస్టుపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. పంజాబ్ ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని, అరెస్టులతో పార్టీని అణిచివేయలేరని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిన నేపథ్యంలో, తాజా అరెస్ట్ పార్టీని మరింత ఆత్మరక్షణలో పడేసింది.









