నీట్ 2026 పరీక్ష రద్దు: వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా ‘ప్రైవేట్ మాఫియా’ పేపర్ లీక్!

మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్-యూజీ (NEET UG) 2026 పరీక్షా పత్రం లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 22.79 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మొత్తం పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం కేసును సీబీఐ (CBI)కి అప్పగించింది.

మహారాష్ట్రలో మొదలై.. ఐదు రాష్ట్రాలకు వ్యాప్తి

పోలీసుల దర్యాప్తులో ఈ లీకేజీకి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం తొలుత మహారాష్ట్రలోని నాసిక్‌లో మొదలైనట్లు గుర్తించారు.

  • నాసిక్ నుండి లీకైన పేపర్‌ను హర్యానాకు పంపి, అక్కడ ఐదు వేర్వేరు సెట్లుగా తయారు చేశారు.

  • అనంతరం రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా మరియు జమ్మూ కశ్మీర్‌లోని కోచింగ్ సెంటర్ల నెట్‌వర్క్ ద్వారా పంపిణీ చేశారు.

  • రాజస్థాన్ పోలీసులు దర్యాప్తులో ‘Private Mafia’ పేరుతో ఉన్న ఒక వాట్సాప్ గ్రూపును గుర్తించారు. ఇందులో 400 మంది సభ్యులు ఉండగా, సమాచారం లీక్ కాకుండా గ్రూప్ డిస్క్రిప్షన్‌లోనే కఠిన హెచ్చరికలు ఉండటం గమనార్హం.

60 ప్రశ్నలు అక్షరం పొల్లు పోకుండా..

రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న చేతిరాతతో కూడిన ‘గెస్ పేపర్’ను పరిశీలించగా, అసలు పరీక్షా పత్రంలోని 60 ప్రశ్నలు యథాతథంగా ఉన్నట్లు తేలింది. లీకైన ఈ పత్రంలో బయాలజీ, కెమిస్ట్రీ విభాగాలకు చెందిన 140 ప్రశ్నలు (సుమారు 600 మార్కులు) ఉన్నాయి. పరీక్షకు రెండు రోజుల ముందే ఈ ప్రశ్నలు మాఫియా చేతికి చిక్కినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నాపత్రం కోసం అభ్యర్థుల నుండి తొలుత ₹5 లక్షల వరకు వసూలు చేయగా, పరీక్షకు ముందు రోజు రాత్రి ఆ ధర ₹30 వేలకు పడిపోయినట్లు సమాచారం.

45 మంది అరెస్ట్ – త్వరలో కొత్త షెడ్యూల్

ఈ కుంభకోణానికి సూత్రధారులుగా భావిస్తున్న జైపూర్‌కు చెందిన మనీష్ యాదవ్‌, రాకేష్ మాండవరియా సహా ఐదు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షా పారదర్శకత దెబ్బతినడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, అభ్యర్థులు అధైర్యపడొద్దని, త్వరలోనే పునర్నిర్వహణ (Re-exam) తేదీలను మరియు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు