తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్ మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, ప్రజా రవాణా వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆయన తార్నాక నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రోలో పయనించారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఆయన, రోజువారీ ప్రయాణాల్లో మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ప్రయాణానంతరం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు, ఇంధన పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన దిగుమతులపై దేశంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) ఎక్కువగా ప్రోత్సహించాలని, తద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించవచ్చని ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘బాధ్యతాయుత జీవన విధానం’ గురించి వివరిస్తూ.. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంలో భాగంగా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత” అనే సందేశాన్ని ఈ మెట్రో ప్రయాణం ద్వారా చాటిచెప్పారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సామాన్యుడిలా ఆయన చేసిన ఈ ప్రయాణం మెట్రో ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంది.









