పార్టీని వీడాలనుకునేవాళ్లు వెళ్లిపోవచ్చు.. అవసరమైతే నేనూ రంగులు వేస్తా: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచి, 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన టీఎంసీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా విఫలమై కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. దీంతో బెంగాల్‌లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని కాషాయ జెండాను ఎగురవేసింది. ఈ ఓటమి తర్వాత టీఎంసీలో అంతర్గత విబేధాలు, పార్టీ ఫిరాయింపులపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, అసమ్మతి నేతలకు, రెబల్స్‌కు దీదీ తన నివాసంలో జరిగిన భేటీలో గట్టి క్లారిటీ ఇచ్చారు.

ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో కాళీఘాట్‌లోని తన నివాసంలో మమతా బెనర్జీ శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో ఆమె మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత స్పందిస్తూ.. “పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉండొచ్చు, వీడాలనుకునే వాళ్లు నిరంభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. ఎవరైనా పార్టీని వీడితే వారిని నేను అడ్డుకోను. మిగిలి ఉన్న వాళ్లే దెబ్బతిన్న పార్టీ ఆఫీసులను మళ్లీ నిర్మించండి. వాటికి రంగులు వేయండి, అవసరమైతే నేనే స్వయంగా దిగి రంగులు వేస్తాను. పార్టీని మళ్లీ కొత్తగా నిర్మిస్తాను తప్ప ఎప్పటికీ ఎవరి ముందూ తలవంచను” అని ఖరాఖండిగా చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ప్రజా తీర్పును ప్రత్యర్థులు ‘చోరీ’ చేశారని ఆరోపించిన మమతా, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున అభ్యర్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ఈ వేదికను ఉపయోగించుకున్నారు. భేటీ అనంతరం టీఎంసీ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఈ సమావేశపు ఫోటోలను పంచుకుంటూ.. “టీఎంసీ ఎల్లప్పుడూ ఒక కుటుంబంలా ఐక్యంగా నిలబడుతుంది. ప్రజల తీర్పును దోచుకున్న వారి ముందు తలవంచే ప్రసక్తే లేదు, అంతిమంగా సత్యమే గెలుస్తుంది” అని పోస్ట్ చేసింది. కాగా, ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ సైతం తన కంచుకోట అయిన భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలవడం గమనార్హం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు