అవినీతి తిమింగలం: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, రూ.100 కోట్ల ఆస్తులు గుర్తింపు!

తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు వణుకు పుట్టిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో, హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి (HMWS&SB) జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక దాడులు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు చెందిన, బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 8 విభిన్న ప్రాంతాలలో ఏకకాలంలో ఈ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మల్లాపూర్‌లోని జీఎం కుమార్ స్వగృహంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు.

ఈ తనిఖీల్లో అధికారులకు భారీ ఎత్తున నగదు పట్టుబడటం సంచలనం రేపుతోంది. జీఎం కుమార్ ఇంట్లో కుప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్వాధీనం చేసుకున్న నగదు విపరీతంగా ఉండటంతో, దానిని ఖచ్చితంగా లెక్కించేందుకు అధికారులు ప్రత్యేకంగా క్యాష్ కౌంటింగ్ మెషీన్లను (Cash Counting Machines) సైతం రప్పించాల్సి వచ్చింది. ప్రాథమిక సోదాల్లోనే లెక్చర్‌కు దొరికిన దాదాపు రూ. కోటి 10 లక్షల నగదుతో పాటు సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జలమండలి మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసాల్లో లభ్యమైన డాక్యుమెంట్ల ప్రకారం.. మార్కెట్ విలువ ఆధారంగా సుమారు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలలో 3 విలాసవంతమైన ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లతో పాటు నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు పత్రాలు లభించాయి. పట్టుబడిన ఈ భారీ నగదు, ఇతర బినామీ ఆస్తుల వివరాలపై దర్యాప్తు బృందం ప్రస్తుతం లోతుగా ఆరా తీస్తోంది. ఇంకా ఓపెన్ చేయని బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేయాల్సి ఉందని, సోదాలు పూర్తిగా ముగిసిన అనంతరం లభించిన మొత్తం ఆస్తుల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు