దేశంలోని సామాన్య వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పెద్ద షాక్ ఇవ్వబోతోంది. దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులను పెంచే దిశగా కేంద్ర విద్యుత్ అథాంటి (CEA) ఒక కీలకమైన ప్రతిపాదనను తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశంలో సోలార్ పవర్ (సౌర విద్యుత్) వాడకం వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) ఆదాయం గణనీయంగా పడిపోతోంది. ఈ నష్టాల నుంచి డిస్కంలను గట్టెక్కించడానికి మరియు గ్రిడ్ నిర్వహణ ఖర్చులను పూడ్చుకోవడానికి వీలుగా కరెంట్ బిల్లుల్లో ఉండే ‘ఫిక్స్డ్ ఛార్జీలను’ (స్థిర ఛార్జీలు) భారీగా పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రస్తుతం చాలా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో పాటు ఆర్థికంగా స్థిరపడిన సంపన్న కుటుంబాలు తమ భవనాలపై రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీనివల్ల వారు తమకు కావలసిన విద్యుత్ను సొంతంగా తయారు చేసుకుంటూ, ప్రభుత్వ గ్రిడ్ నుంచి కరెంట్ కొనడం బాగా తగ్గించేశారు. కేవలం అత్యవసర సమయాల్లో లేదా రాత్రి వేళల్లో మాత్రమే ప్రభుత్వ విద్యుత్ను వాడుతున్నారు. ఈ మారిన పరిస్థితుల వల్ల డిస్కంల రాబడి తగ్గి తీవ్ర నష్టాలు వస్తుండటంతో, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడే ఖర్చులను అందరి వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి ఈ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు.
ఈ స్థిర ఛార్జీల పెంపును ఒకేసారి కాకుండా రాబోయే 2030 నాటికి దశలవారీగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం, గృహ మరియు వ్యవసాయ వినియోగదారుల నుంచి 25 శాతం మేర స్థిర ఖర్చులను వసూలు చేయనున్నారు. అదే సమయంలో కమర్షియల్ (వాణిజ్య), పారిశ్రామిక వినియోగదారుల నుంచి ఏకంగా 100 శాతం స్థిర ఛార్జీలను వసూలు చేయాలని యోచిస్తున్నారు. ఈ కొత్త టారిఫ్ విధానం అమల్లోకి వస్తే, వినియోగదారులు కరెంట్ తక్కువగా వాడినా లేదా అసలు వాడకపోయినా కూడా నెలవారీ కనీస ఛార్జీల రూపంలో ఎక్కువ మొత్తంలో బిల్లు చెల్లించాల్సి వస్తుంది.









