ప్రేమించుకునే టీనేజ్ జంటలను చట్టపరమైన చిక్కుల నుంచి రక్షించేందుకు నేపాల్లోని బాలేంద్ర షా ప్రభుత్వం ఒక విప్లవాత్మక చట్ట సవరణకు శ్రీకారం చుట్టబోతోంది. పరస్పర అంగీకారంతో కూడిన శారీరక, మానసిక బంధాల్లో ఉండే టీనేజర్లపై ఆటోమేటిక్గా అత్యాచార కేసులు నమోదు కాకుండా నిరోధించేందుకు వీలుగా.. తమ దేశ అత్యాచార నిరోధక చట్టంలో ఒక ప్రత్యేకమైన ‘రోమియో జూలియట్’ క్లాజ్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం తీవ్ర చర్చల్లో ఉన్న ఈ ప్రతిపాదిత సంస్కరణ ప్రకారం.. 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల జంటల మధ్య వయస్సు వ్యత్యాసం గరిష్టంగా మూడు సంవత్సరాల లోపు ఉంటే, వారి పరస్పర సమ్మతితో కూడిన సంబంధాలకు చట్టం నుండి మినహాయింపు లభిస్తుంది.
నేపాల్లో ప్రస్తుతం ఉన్న కఠినమైన చట్టాల ప్రకారం.. 18 ఏళ్ల లోపు ఉన్న వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకున్నా, వారిద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉన్నప్పటికీ దానిని అత్యాచారంగానే పరిగణిస్తారు. కానీ దేశంలో చట్టబద్ధమైన వివాహ వయస్సు మాత్రం 20 ఏళ్లుగా ఉంది. ఈ నిబంధనల లోపాల వల్ల క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ఇంటర్ కాస్ట్ ప్రేమాయణాలు సాగించే జంటలు లేదా ఇళ్లను వదిలి పెళ్లి చేసుకునే వారి విషయంలో.. అమ్మాయిల కుటుంబ సభ్యులు అబ్బాయిలపై అత్యాచార కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఈ విధంగా చట్టాన్ని మైనర్ల రక్షణ కోసం కాకుండా, యువ జంటలను శిక్షించడానికి, ప్రేమలను విడదీయడానికి ఆయుధంగా వాడుకుంటున్నారని న్యాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రతిపాదిత మార్పులపై నేపాల్ లా సెక్రటరీ ఉదయా రాజ్ ధుంగన స్పందిస్తూ, ఇలాంటి కేసుల సంఖ్య కోర్టుల్లో విపరీతంగా పెరుగుతుండటాన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం ఈ చట్టాన్ని సిద్ధం చేస్తోందని తెలిపారు. అయితే అత్యాచార చట్టాలను బలహీనపరచడం తమ ఉద్దేశం కాదని, సహజమైన టీనేజ్ సంబంధాలకు మరియు లైంగిక దోపిడీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒకవేళ వయస్సు వ్యత్యాసం 3 ఏళ్లకు మంచినా, లేదా లైంగిక వేధింపులు, బలవంతపు చర్యలకు పాల్పడినా సాధారణ కఠినమైన క్రిమినల్ చట్టాలే వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనకు యువత, విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ, బాలల హక్కుల సంఘాలు మాత్రం బాలికల రక్షణ బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.









