తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన జోసెఫ్ విజయ్ ప్రభుత్వం వరుస వివాదాల్లో ఇరుక్కుంటోంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన రోజున తమిళ రాష్ట్ర గీతానికి జరిగిన అవమానం మరువకముందే.. తాజాగా జరిగిన క్యాబినెట్ విస్తరణ వేడుకల్లోనూ అదే వివాదం పునరావృతమైంది. సాంప్రదాయం ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో ఆలపించాల్సిన తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళుత్తు’ను.. నిబంధనలకు విరుద్ధంగా వందేమాతరం, జనగణమన తర్వాత మూడో స్థానంలో (చివరిగా) ఆలపించడం తీవ్ర దుమారానికి దారితీసింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనే రెండోసారి జరగడంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదంపై అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ వర్గాలు భిన్నంగా స్పందించాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రాజ్భవన్ నిర్వహించిందని, ఇందులో తమిళనాడు ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని టీవీకే నేత నంజిల్ సంపత్ సమర్థించుకున్నారు. గతంలో జరిగిన వివాదంపై వివరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారమే గవర్నర్ కార్యాలయం వ్యవహరించిందని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర గీతాన్ని మూడో పాటగా ప్లే చేయాల్సి వచ్చిందని గతంలో మంత్రి ఆదవ్ అర్జున పేర్కొన్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గీతాన్నే మొదట ఆలపిస్తామని, ఇలాంటి పొరపాటు మళ్లీ జరగదని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అది ఒట్టిదేనని తేలిపోయింది.
తమిళ సంస్కృతి, సంప్రదాయాలను ఉల్లంఘించేలా జరిగిన ఈ అపచారంపై ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు ప్రభుత్వ మిత్రపక్షాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘తమిళుల హక్కులను కాపాడటంలో విజయ్ ప్రభుత్వం మరోసారి ఘోరంగా విఫలమైంది’ అని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నదురై విమర్శించగా, దీనికి ఎవరు బాధ్యులో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ కార్యదర్శి ఎం. వీరపాండియన్ డిమాండ్ చేశారు. గవర్నర్ కార్యాలయం ద్వారా బీజేపీ ఆడుతున్న రాజకీయాలకు ఇది నిదర్శనమని, తమిళ ప్రజల మనోభావాలతో ఆడుకోవడం అన్యాయమని కాంగ్రెస్ ఎంపీ ఎస్. జ్యోతిమణి మండిపడ్డారు. ఈ వివాదాల నేపథ్యంలో విజయ్ ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరణ హెచ్చరికలు జారీ చేయడం మరింత ఉత్కంఠ రేపుతోంది.









