హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ రంజన్ దారుణ హత్య, మరియు భారీ బంగారు ఆభరణాల దోపిడీ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన అంతర్రాష్ట్ర నేపాలీ ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం విజయవంతంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గత ఎనిమిది నెలలుగా ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న కల్పన అనే నేపాలీ పనిమనిషే ఈ దోపిడీకి, హత్యకు ప్రధాన సూత్రధారిగా నిలిచిందని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.
పోలీసుల కథనం ప్రకారం, పుణెలో పనిచేస్తున్న సమయంలో వికాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన కల్పన, తాను ప్రస్తుతం పనిచేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో భారీగా నగలు, సంపద ఉన్న విషయాన్ని అతనికి చేరవేసింది. వికాస్ ఆదేశాల మేరకు ఇంట్లోని ప్రతి కదలికను లీక్ చేస్తూ, యజమాని లేని సమయం చూసి దొంగతనం చేయడానికి ఒక పెద్ద నేపాలీ గ్యాంగ్ను రంగంలోకి దంపించింది. మే 8వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ప్లాన్ ప్రకారం ముగ్గురు నిందితులు ఇంట్లోకి చొరబడగా, మిగిలిన నలుగురు బయట కాపలాగా నిలిచారు. బెడ్రూమ్లో ఉన్న తనూజ రంజన్ నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఆమె మెడలోని నగలతో పాటు బీరువాలోని మొత్తం 23 తులాల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు.
హత్య అనంతరం నిందితులు నాంపల్లి రైల్వేస్టేషన్ నుండి రైళ్లు మారుస్తూ, ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడుకుంటూ యూపీ-నేపాల్ సరిహద్దు దాటడానికి స్కెచ్ వేశారు. అయితే ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను ట్రాక్ చేశారు. ఈ వేటలో ముఠా సభ్యుడైన సునీల్ పెర్యార్తో పాటు, అతడి నుండి ముంబైలో బంగారం కొనుగోలు చేసిన దిలీప్ బిశ్వకర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ఇప్పటికే నేపాల్ పారిపోయినట్లు అనుమానిస్తుండగా, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.









