తన అరెస్ట్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా స్పందించారు. ఏబీపీ దేశం ప్రతినిధితో ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. ఆ వార్తలన్నీ పూర్తిగా బోగస్ అని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన ఇంటి వద్ద పోలీసులు ఉన్న మాట వాస్తవమేనని, అయితే వారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కారని, తెలంగాణ పోలీసులని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తనకు వస్తున్న బెదిరింపు కాల్స్, మెసేజ్ల నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు రక్షణ కోసమే తన ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారని నాగేశ్వర్ వెల్లడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అమిత్ షా ల అంతర్గత సంభాషణలపై తాను చేసిన వ్యాఖ్యల వివాదం ఇప్పటికే ముగిసిన అధ్యాయమని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. జనసేనకు సంబంధించిన ఆ వ్యాఖ్యలను తాను ఇప్పటికే ఉపసంహరించుకున్నానని, ముగిసిపోయిన ఈ అంశంపై మళ్లీ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుండి తనకు ఎలాంటి నోటీసులు గానీ, ఫోన్ కాల్స్ లేదా వాట్సప్ ద్వారా సమాచారం గానీ అందలేదని, తనపై కేసు నమోదైనట్లు కూడా ఎవరూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. జనసేన క్యాడర్ కూడా దీనిపై స్పందించవద్దని ఆ పార్టీ నుంచే ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేశారు.
మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారికంగా స్పందిస్తూ ఈ ఫేక్ వార్తలకు చెక్ పెట్టారు. నాగేశ్వర్ను అరెస్ట్ చేసేందుకు ఏపీ నుండి పోలీసులు ఎవరూ హైదరాబాద్ వెళ్లలేదని ఆమె తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టం చేశారు. కేవలం దురుద్దేశంతోనే సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారని హోం మంత్రి తీవ్రంగా ఖండించారు. సమాజంలో అలజడి సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని అనిత హెచ్చరించారు.









