ఆడబిడ్డల వల్లే విజయం.. ఇది మహిళా మహానాడు: సీఎం నారా చంద్రబాబు నాయుడు

ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి సాధించిన చారిత్రాత్మక విజయంలో మహిళలు అత్యంత కీలక పాత్ర పోషించారని, అందుకే ఈ మహానాడును వారికి అంకితం చేస్తూ ‘మహిళా మహానాడు’గా ప్రకటిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వర్చువల్ విధానంలో జరిగిన మహానాడు సభలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. తమ ప్రభుత్వానికి మహిళలు, యువత భవిష్యత్తే ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ‘దీపం 2.0’ కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వివరించిన సీఎం, రానున్న రోజుల్లో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెన్ జీ (Gen Z), జెన్ ఆల్ఫా తరం ఆలోచనలకు అనుగుణంగా సరికొత్త విధానాలను రూపొందిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏరోస్పేస్, సెమీ కండక్టర్స్ వంటి అధునాతన రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ హబ్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనలో గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని తీసుకొచ్చామని, దీని ద్వారా కేవలం 23 నెలల్లోనే రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని చెప్పారు. ఫైటర్ జెట్, బుల్లెట్ మోటార్‌సైకిల్ వంటి భారీ ప్రాజెక్టులకు సైతం అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేశామని గుర్తుచేశారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను, అలాగే 5,757 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా, భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసమే అహర్నిశలు శ్రమిస్తుందని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. యువత సంకుచిత ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ఆకాశమే హద్దుగా అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు